21 June 2007

ఆంధ్ర సాహిత్య చరిత్రపై అరుదైన ముద్ర ఆరుద్ర

ఆంధ్రసాహిత్యచరిత్రలో ఒక అపూర్వమైన, అరుదైన సంఘటన, ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి, ఒక ఇతిహాసంగా రూపొందడం. కవి, విమర్శకుడు, సాహిత్యచరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి, అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర జీవితప్రస్థానం ఒక ఇతిహాసం. ఒక సాహిత్య సాంస్కృతికసుదర్శనం. అభ్యుదయకవులలో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే, ఆరుద్ర రెండవ తరానికి చెందినవాడు, ఒకే ఒక్కడు.

''తరానికో వంద కవులుతయారవుతారెప్పుడూ

వందలోనూ మందలోనూమిగలగలిగేదొక్కడు''

అనే ఆరుద్ర మాటల్లోనే అభ్యుదయకవిత్వోద్యమంలో నిలదొక్కుకుని ఆ తరంలో మిగలగలిగిందీ, విశ్వరూపం దాలిచిందీ తానొక్కడే అని ఆరుద్రపై పరిశోధన చేసిన ఆర్‌. నరసింహారావు తన సిద్ధాంతగ్రంథం 'అభ్యుదయకవిత్వం-ఆరుద్రత'లో పేర్కొన్నాడు. ఆరుద్ర అభ్యుదయవాది, సామ్యవాది, ప్రయోగవాది, కమ్యూనిస్టు, మార్క్సిస్టు దృక్పథం ప్రగతిపథంలో నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా ప్రయోగదృష్టితో కవిత్వం వ్రాశాడు.

అభ్యుదయకవిత్వానికి ఆదిరుద్రుడైన శ్రీశ్రీ, ఆరుద్రను ఆరో రుద్రుడుగా పేర్కొన్నాడు. శ్రీశ్రీ తర్వాత వెంటనే మ్రోగే పేరు ఆరుద్రదే కావడం వల్ల, అతడు రెండో రుద్రుడు. శ్రీశ్రీ చిరునామాయే తన చిరునామాగా జీవించిన ఆరుద్ర, శ్రీశ్రీ ప్రభావం నుండి బయటపడటానికి అన్ని మార్గాలనూ అన్వేషించాడు. తనపై శ్రీశ్రీ ప్రభావం కంటె పఠాభి, నారాయణబాబుల ప్రభావమే ఎక్కువ అంటాడు ఆరుద్ర. ''ఆరుద్ర కవితాజగత్తులోకి అడుగుపెట్టిన తరువాత శబ్దాలకు గల వింత వింత జిలుగులు, రంగుల స్ఫురణకు ప్రాముఖ్యత వచ్చింది'' అని ఆరుద్ర పదప్రయోగవైచిత్రికి యోగ్యతాపత్రాన్నిచ్చాడు శ్రీరంగం నారాయణబాబు. అంత్యప్రాసలే ఆరుద్ర చేవ్రాలుగా నిలిచాయి.

''కవిత కోసం నేను పుట్టాను కాంతి కోసం కలం పట్టాను'' అని ఆరుద్ర నవ సమాజనిర్మాణానికి కృషి చేశాడు. ఆరుద్ర 'త్వమేవాహమ్‌' (నీవే నేను), నైజాం పరిపాలనలో ప్రజల కడగండ్లకు సజీవదర్పణం. 'సినీవాలి'లో మధ్యతరగతి మనస్తత్వనాటకీయత, 'ఇంటింటి పజ్యాల'లో హృదయం జల్లుమనే తటిల్లత, ఏటికేడాదిలో సమకాలీనసమాజంలో మార్పు తేవాలనే తపన, కూనలమ్మ పదాలలో వేమన తాత్వికచింతన, పైలాపచ్చీసులో వైచిత్రిప్రియత్వమూ విశ్వరూపదర్శనమిచ్చి, పఠితల హృదయవీణాతంత్రులను మీటుతాయి.

నెల కొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆరుద్ర, గేయాలు, కథలు, నవలలు, గేయనాటికలు, సాహిత్యపరిశోధకవ్యాసాలు, కవితలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు, అనువాదాలు, సినీ గీతాలు, సమగ్ర ఆంధ్రసాహిత్యసంపుటాలు, మొదలైన రచనలు ఆయన వాఙ్మయవైవిధ్యాన్ని విస్తృతిని తెలియజేస్తాయి. శ్రీశ్రీ తన గేయాలను ఆవేశంగా కనుల ముందు బొమ్మ కట్టిస్తే, ఆరుద్ర తనగేయాలను ఆలోచనతరంగాలుగా కంపింపజేస్తాడు. శ్రీశ్రీ ముద్ర వేరు, ఆరుద్ర ముద్ర వేరు. ఎవరి పాదముద్రలు వారివే. శ్రీశ్రీ శబ్దాలంకారాల ఢమరుకనాదాలతో మహేంద్రజాలమాయాపురిని సృష్టిస్తే, పాఠకుల పరిధిలోకి రాని ప్రతీకలతో అర్థం కాని భావచిత్రాలతో నారికేళపాషాణపాకాలను తయారుచేస్తాడు ఆరుద్ర. అభ్యుదయకవి అయినా కొత్త పోకడల చాపల్యం, ఆరుద్ర కవితకు ఘూర్జటీవధూటి నిగూఢత్వాన్ని కలిగించింది.

''ఆరుద్ర తన ఛందస్సుల చేత అందం గా చాకిరీ చేయించుకోగలడు... శుద్ధవచనం రాస్తున్నా దాని గమనంలో ఒక వేగం సాధించగలడు'' అని శ్రీశ్రీ, ఆరుద్ర రచించిన 'త్వమేవాహమ్‌'కు వ్రాసిన పీఠికలో ఆరుద్ర కవిత్వాన్ని మెచ్చుకున్నాడు. రైలులో ఒక స్త్రీ, ప్రయాణికుల ముందు నగ్నంగా నిలబడి, ''రజాకార్ల చేతిలో దోపిడీకి గురైన నాకు సిగ్గెందుకు'' అన్న వార్త, ''నాకా సిగ్గు నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది'' అనే శీర్షికతో కృష్ణాపత్రిక 1948 జూలై 10వ తేదీన ప్రచురించినదాన్ని చదివి ఆరుద్ర తీవ్రంగా చలించాడు. ఆ ఆగ్రహమే తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో వెలువడిన 'త్వమేవాహమ్‌' (నువ్వే నేను) కావ్యానికి కారణమై, ఆరుద్ర తెలంగాణ ప్రజానీకంతో ఏకత్వాన్ని ప్రకటించడానికి తోడ్పడింది. తొలుత ఆరుద్ర కావ్యానికి తెలంగాణ పేరు పెడితే 'త్వమేవాహమ్‌' అనే శీర్షిక ఉచితంగా ఉంటుందని ఆ విధంగా మార్చాడు శ్రీశ్రీ. మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబించిన ఈ కావ్యంలో, కాలాన్ని ప్రవాహంలా భావిస్తూ దానిని పర్వతదశ, ఉపనదులు, ప్రవాహ దశ అని మూడు దశలుగా దర్శించాడు ఆరుద్ర.

'త్వమేవాహమ్‌' కావ్యంలో గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు, కాలానికి సమాజానికి సంబంధించిన ప్రతిభావంతమైన ప్రతీకలుగా మలచబడ్డాయి. కాలానికి సంకేతమైన 'గడియారం' ఈ సమాజానికి ప్రతీక అయితే, గంటలు పెట్టుబడిదారులు, శ్రీమంతులు, నిమిషాలు మధ్యతరగతిప్రజలు సామాన్యులు, సెకండ్లు అడుగు జనం. చిన్నముల్లు పైతరగతి మనస్తత్వానికి చిహ్నమైతే పెద్ద ముల్లు మధ్యతరగతి స్వభావానికి, సెకండ్ల ముల్లు శ్రామికవర్గసిద్ధాంతాలకు ప్రతీకలు. త్వమేవాహమ్‌ కావ్యమూలాలు తెలంగాణ ఉద్యమక్షేత్రంలో ఉన్నాయి. నిజాం నిరంకుశపాలనలో దుర్భరజీవితా న్ని గడుపుతున్నారు ప్రజలు.

''నీ చైతన్యంఅరముగ్గిన అవకాశంచిరంజీవి మానవుడా త్వమేవాహమ్‌'' అంటూ ఆరుద్ర, చిరంజీవి మానవునిలో మమేకం అయ్యాడు. ఒక వైపు నిజాం నవాబుతోనూ, మరోవైపు భూస్వాములతోనూ, పోరాడుతున్న సామాన్యరైతు చిరంజీవితో, ఆరుద్ర, 'త్వమేవాహమ్‌' అవడం అతని అభ్యుదయదృక్పథానికి నిదర్శనం. 'త్వమేవాహమ్‌' రచనతో ఒక కవిగా గుర్తింపు, చిరునామా లభించాయి, ఆరుద్రకు.

కవిత్వం ప్రయోజనం కోసం కావలసిన నూతనదృక్పథంపై శ్రీశ్రీ, అబ్బూరి వరదరాజేశ్వరరావుతో కలసి ఆరుద్ర చేసిన దీర్ఘమైన చర్చల ఫలితంగా, కవిత్వం పట్ల ఆరుద్ర ఏర్పరచుకున్న నిర్దుష్టమైన అభిప్రాయాలకు అక్షరరూపమే 'సాహిత్యోపనిషత్‌' అనే లక్షణకావ్యం . కవిత్వానికి మూల బీజాలు సమాజంలోనే ఉంటా యి. ఉత్తమ కవిత్వం ఎప్పుడూ గాయాల్లోంచే పుడుతుంది. గాయపడిన మనసులను ఊరడిస్తూనే ఉంటుంది. ఆరుద్ర ఆ కావ్యంలో కవితాతత్వాన్ని మానిషాద శ్లోకం లోంచి దర్శించాడు.

''ఎప్పుడో మానిషాదలో పుట్టిందట మొదటి కవిత్వం

ఎప్పుడైనా అలాంటి ఘటనతో పుట్డడమే దాని తత్వం

అక్రమం జరగడం కవితకు నాందనేది ముఖ్యం''

కవిత్వంలో వస్తువుకి, శిల్పానికి సమానమైన ప్రాధాన్యం ఉంది. ఒకటి లేకుండా రెండోది కవిత్వం కాదు. అందుకే వస్తువు, శిల్పం రెండూ కవిత్వమనే శకటానికి రెండు చక్రాలని ఇలా చెప్పాడు ఆరుద్ర.

''ఏమిటి చెప్పడం ఎలా చెప్పడం

అనేవి రెండు రెండు చక్రాలు

ఈ రెండు సమంగా ఒప్పడం బండిని తిప్పడం''

మధ్యతరగతి స్వప్నానికి అక్షరరూపం 'సినీవాలి' కావ్యం. అది మధ్యతరగతి మనస్తత్వానికీ, నగరజీవితానికీ నిలువుటద్దం. సినీవాలి అంటే అమావాస్య రేయి చంద్రరేఖ అని అర్థం. జీవనవిభావరిలో అతి సన్నని వెలుగు రేఖను దర్శింపజేస్తుందీకావ్యం. 'నేడమావాస్య'తో మొదలై 'ఇది సినీవాలి' అనే మాటతో ముగియడం కవి ఆశావహదృక్పథాన్ని సూచిస్తుంది. నిరాశా నిస్పృహలనే చీకట్లను చీల్చుకుని చిన్న ఆశ అనే వెలుగు రేక ఉదయిస్తుంది. 'సినీవాలి'లో కథానాయకుడు మధ్యతరగతి జీవితానికి ప్రతినిధి. స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటూ ఎప్పుడూ సంకెళ్లతోనే జీవిస్తుంటాడు. వెలగవలసిన జీవితం చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు, మనసు నిండా నిరాశ పేరుకున్నప్పుడు, దానిని ఛిన్నాభిన్నం చేయడానికి ఒక చిరుదీపాన్ని అయినా వెలిగిస్తే చాలు అనే ఆశాజనకమైన సందైశాన్ని 'సినీవాలి'లో ఆరుద్ర అందించాడు.

జానపదకళారూపాలైన 'కూనలమ్మ పదాల'లో వస్తువైవిధ్యంతో కూడిన వర్తమానసామాజికజీవితంలోని వైరుద్ధ్యాలను ఆవిష్కరించాడు ఆరుద్ర. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, పాఠకుడి హృదయంలోకి దూసుకుపోయేలా, ఎలా చెప్పాలో అతనికి బాగా తెలుసని నిరూపిస్తాయి కూనలమ్మ పదాలు. ప్రేమతత్వాన్ని గురించి, శృంగారరసాన్ని గురించి, మతమౌఢ్యం గురించి, స్త్రీవాదభావాల గురించి చెబుతూ, కూనలమ్మ ఆత్మని సాక్షాత్కరింపజేశాడు ఆరుద్ర.

సగటు మనిషి తన జీవితంలోకి తొంగిచూసుకుంటే ఎలా ఉంటుందో చిన్న చిన్న సంఘటనల ద్వారా తెలియజేసే హాస్యకవితలు ఆరుద్ర 'ఇంటింటి పజ్యాలు.' వీటిలోని వస్తువు అందరికీ అనుభవైకవేద్యం. హృద్యమైన ఈ పద్యాలు కవిలోని హాస్యప్రియత్వానికి నైవేద్యాలు. సామాన్యమైన వస్తువుతో చమత్కారంతో నిత్యనూతనత్వాన్ని ధ్వనిస్తూంటాయి కవితలు. పైలాపచ్చీసు కవితాసంకలనం వస్తువు భాష, అభివ్యక్తి, దృక్పథాల అపూర్వసమ్మేళనం.

'ఏటికేడాది' కవితలలో భారతీయలౌకిక దృక్పథానికి పట్టుకొమ్మ అయిన మతసామరస్యం, స్వాతంత్య్రం వచ్చి చాలా కాలమైనా వీడని దారిద్య్రపు నీడలు మొదలైన సామాజికసమస్యలు దర్శనమిస్తాయి. సమాజం అనే రంగస్థలంపై తెర మరుగైపోయిన స్త్రీ స్థానం, స్త్రీ భాగస్వామ్యం,త్యాగఫలం సఫలం కావాలంటే, గతాన్ని స్మరించక తప్పదు-అని చెబుతుంది ఆరుద్ర అసంపూర్ణరచన స్త్రీ పురాణం. అనాదిగా స్త్రీ జీవితం ఆలోచనవిధానం, మానసికవికాసం-అన్నింటినీ క్రమబద్ధంగా దీనిలో చర్పించడమైంది.

కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారి ప్రేరణతో, ఆధునికసమస్యలను ఆధునికమైన పోకడలతో, ఆరుద్ర 'శుద్ధ మధ్యాక్కరలు'లో అభినివేశింపజేశాడు. ఈ నాటి ఆడపిల్లల తండ్రుల అవస్థని ఇలా వర్ణిస్తాడు

''కన్యకల పరిణయసమస్య

కారునల్లని అమావాస్య

మాన్యాలపై అప్పు తెచ్చి

మ్యారేజి చేయడం పిచ్చి

అన్యాయమీ శుల్కమనుచు

అడగడం తెగ పాపమనుచు

అన్యులకు తాను బోధించి

ఆశించు కట్నాల సంచి''

అంత్యప్రాసలతో, అక్కడక్కడ ఆంగ్లపదాలతో, సాంఘికనీతిని ఆసక్తికరమైన రీతిలో ఆవిష్కరిస్తాయి, ఈ మధ్యాక్కరలు.

దక్షిణవేదమైన, దుర్భేద్యమైన 'తిరుక్కురళ్‌' తెలుగు అనువాదం, ఆరుద్ర తమిళ ప్రావీణ్యాన్ని తెలియజేస్తుంది. హోచిమిన్‌ 'జైలు గీతాలు' ఆంగ్లం నుండి అనువదించినప్పుడు కూడా కొంచెం స్వేచ్ఛగా అవి స్వతంత్రగీతాలనే భ్రాంతి కలగజేస్తాయి. 'సాలభంజిక, దీర్ఘరాత్రం, తదేవ గృహం' మొదలైన అనేకప్రయోగాత్మకనాటికలు, రేడియో నాటికలు రచించాడు ఆరుద్ర. ఇవన్నీ ప్రదర్శనయోగ్యాలే. 'కాటమరాజు కథ' అనే చారిత్రకనాటకం ప్ర

సిద్ధమైంది. 'దేవుని ఎదుట, రాదారి బంగళా' ప్రయోగాత్మకనాటకాలు. ఆరుద్ర రాసిన డిటెక్టివ్‌ నవలలు, కథలు అనేకం. వాటిలో 'పలకల వెండి గ్లాసు' పేరు పొందింది.

కొన్ని వేల సినిమా పాటలే కాకుండా సినిమాలలో కథ, మాటలు కూడా ఆరుద్ర వ్రాశాడు. 'ఎదగడాని కెందుకురా తొందరా', 'ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలో మమకారం ఎప్పటికీ పోదు' మొదలైన ఆరుద్ర సినీ గీతాలు చిరస్మరణీయాలు. ఆరుద్ర ఇతరరచనలన్నీ ఒక ఎత్తు. 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' సంపుటాల రచన మరో ఎత్తు. ఇంత వరకు వేరెవ్వరూ ఇంతటి బృహత్తరప్రణాళికను చేపట్టే సాహసం చేయలేదని చెప్పవచ్చు. గతంలో వచ్చిన సాహిత్యచరిత్రల విహంగవీక్షణాలు కూడా అసంపూర్ణాలే. ఆధునికయుగాన్ని స్పృశించినవి దాదాపు లేవని చెప్పవచ్చు. ఆరుద్ర సమగ్ర ఆంధ్రసాహిత్యం ఆ నాటి నుండి ఈ నాటి వరకు 'ఆంధ్రసాహితీచరిత్ర' విశ్వరూపసందర్శనం. సులభమైన, సరళమైన వ్యావహారికశైలిలో, యుగవిభజనతో, విస్తృతమైన పరిధితో, ప్రామాణికమైన స్థాయిలో వెలువడిన ప్రథమగ్రంథంగా దీన్ని పేర్కొనవచ్చు. ఆరుద్ర గతంలో 13 భాగాలుగా వెలువరించిన బృహత్‌ గ్రంథాన్ని తెలుగుఅకాడమీవారు 2004లోప్రచురించడం తప్ప, ఏ విశ్వవిద్యాలయం గాని ఇటువంటి కృషికి పూనుకోకపోవడం దురదృష్టకరం!

ఆరుద్ర ప్రకటించిన రచనలు, కావ్యాలు, కవితాసంపుటాలు, అనువాదాలు, పద్యకవిత్వం, నాటికలు, జంట కవిత్వం శ్రీశ్రీ, వరదతో కలసి పరిశోధనగ్రంథం, ఇతరత్రా అన్నీ మొత్తం 40 పైగా ఉన్నాయి.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు సాహిత్యజగత్తులో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్న ఆరుద్రకు, కళాశాల విద్య అంతగా లేకపోవడం నమ్మలేని నిజం! చిన్నప్పుడు పాఠశాలలోనూ తెలుగు చదువుకోకపోవడం మరో విశేషం. భాషాజ్ఞానాన్ని చాలా వరకు స్వయంకృషితోనూ, స్నేహితులు అబ్బూరి వరదరాజేశ్వరరావు, మొదలైనవారి సాంగత్యంలోనూ అలవరచుకున్నాడు ఆరుద్ర.

ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకరశాస్త్రి. జననం 1925 ఆగస్టు 31. తల్లిదండ్రులు వెంకటజోగమ్మ-భాగవతుల నరసింగరావు. ఆరుద్ర ఒక నక్షత్రం పేరు. ఒక పురుగు పేరు కూడా. వర్షకాలంలో నేల పరిచిన పచ్చటి తివాసీలా ఉన్నప్పడు, ఎర్రగా ముఖమల్‌లా మెత్తగా మెరుస్తూ నేలపై నడయాడే అందమైన పురుగు ఆరుద్ర. చిన్నప్పడు ఆరుద్ర కూడా ఆ పురుగులాగే ఎర్రగా, బొద్దుగా, చూడముచ్చటగా ఉంటే, స్నేహితులు అతనికి వెటకారంగా పెట్టిన పేరే స్థిరపడింది. సాహిత్యలోకానికి అతడు ఆరుద్రగానే పరిచయమయ్యాడు. నక్షత్రంగా, నింగి పురుగుగా నేలకి సంబంధం కలుపుతూ సాహిత్య ధ్రువతారగా వెలుగొంది, చివరికి 1998 జూన్‌ 4న తారాపథానికేగాడు. ''నీవు ఎక్కవలసిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు'' అనే ఆరుద్ర మాట, అతని అనుభవంలోకి రాకపోవడం ఒక హై లైట్‌!

No comments: